3. మారీచాగమనము
ఇందులో శ్రీరామవనగమనం-పంచవటిలో పర్ణశాలానిర్మాణం-మారీచాగమనం ప్రధానాంశాలు.
శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి బయల్దేరేడు. సీతాలక్ష్మణులు కూడా వస్తామన్నారు. వద్దన్నాడు. వినలేదు. చివరకు అంగీకరించేడు.
నాలుగడుగులు వేయగానే అలిసిపోయింది సీతమ్మ ! ఇంకా అరణ్యమెంతదూరంలో ఉందని అడగడం మొదలుపెట్టింది. అప్పటికింకా అయోధ్య పొలిమేరకూడా దాటనేలేదట !
ఆ శ్లోకం చూడండి -
శ్లో || సద్యఃపురీపరిసరేషు శిరీషమృద్వీ -
గత్వా జవాత్ త్రిచతురాణి పదాని నీత్వా!
గన్తవ్యమస్తి కియదిత్యసకృత్ బృవాణా -
రామాశ్రుణఃకృతవతీ ప్రథమావతారమ్ ||
వెంటనే శ్రీరామచంద్రమూర్తి భూమాతనిలా ప్రార్థిస్తాడు-
శ్లో ||అవని! తవ సుతేయం పాదవిన్యాసదేశే -
త్యజ కఠినత్వం జానకీ యాత్యరణ్యం!
తల్లీ భూదేవి ! పరమ కోమలి నీ కుమార్తె సీతమ్మ అరణ్యవాసమునకు వస్తున్నది . కడుసుకుమారి ఆమె ఎక్కడెక్కడ అడుగుపెడితే అక్కడ నీ కాఠిన్యమును వదిలిపెట్టమ్మా
భావించేకొద్దీ కళ్ళను చెమర్చేలాచేస్తుందీ ఘట్టం!
తులసీ దాసు నిజంగానే చలించిపోయాడు-చూడండీ దోహా -
పురసే నికలీ రఘువీర వధూ - ధరి ర ధరే డగమేఁ మగ దై
ఫిర పూఛతి చలిహో అబ్ కేతర్ - పర్లకుటీ కరి హై కితహై ||
తియ హీ లఖి ఆతురతా - పియ హీ ఆంఖియఁ ఆవైచారు జల ॥ (కవితావలీ)
పంచవటిని కుటీరనిర్మాణానికనుకూలమైన ప్రదేశంగా వర్ణిస్తూ శ్రీరామచంద్రమూర్తి చెప్పిన శ్లోకంలో అనుప్రాససౌందర్యం చూడవలసినదే -
శ్లో ॥ ఏషా పంచవటీ రఘూత్తమ కుటీ యత్రాస్తి పంచావటీ
పాంథస్యైకఘటీ పురస్కృతతటీ సంశ్లేషభిత్తా వటీ
గోదా యత్ర నటీ తరం గిత తటీ కల్లో లచంచత్పుటీ
దివ్యామోదకటీ భవాబ్ధి శకటీ భూతక్రియాదుష్కుటీ ||
ఇది రఘువంశంలో ఉత్తముడైన శ్రీరాముని పంచవటి కూటీ (ఆశ్రమం).
ఇక్కడ ఐదు వృక్షాలు (పంచవటి) ఉన్నాయి.
ప్రయాణికుడికి (పాంథస్య) ఒకే ఒక గడప ముందు ఉంది.
ఆ వృక్షాల (వటీ) కలయికతో గోడలు నిర్మించబడ్డాయి.
గోదావరి నది ఇక్కడ ప్రవహిస్తోంది.
నది తీరంలో పచ్చిక (తటీ) ఉంది.
కల్లు (తాటి చెట్లు) ఉన్నాయి, వాటి చిగురు (పుటీ)లు గాలిలో ఊగిపోతున్నాయి.
ఈ స్థలం దివ్యమైన సువాసన (దివ్యామోద కటీ)ను కలిగిఉంది.
భవసాగరాన్ని దాటి పోవడానికి పడవ (శకటీ) లాంటిది.
ఇక్కడ భూతక్రియ (పితృకర్మలు) చేయడానికి అనుకూలమైన పవిత్ర స్థలం.
ఇలాటకార పౌనఃపున్యంతో ఈశ్లోకము అందాన్ని సంతరించుకున్నది. ‘భూతక్రియాదుష్కుటీ ’ అన్న పదం, మారీచా గమనానికి, నాలుగవ అంకానికి – అంటే, సీతాపహరణానికి నాంది పలుకుతున్నది.