1. జానకీస్వయంవరము

ప్రథమాంకంలో ప్రథానంగా - రామాదుల అవతరణం, విశ్వామిత్రాగమనం, తాటకవధ, యజ్ఞసంరక్షణం, అహల్యాశాపవిమోచనం, జానకీస్వయంవరమనే ఘట్టాలు వర్ణింపబడినాయి. ఇందలి పద్యాలన్నీ రసగుళికలే ! చిత్రములైన భావనలు

ఛందో లంకా రవిశేషాలు సమస్యాపూరణాలు… చూచే కన్నులు, ఆస్వాదించే హృదయము ఉండాలేగాని ప్రతి పద్యంలోను ప్రతి పదంలోను ఏదో విశేషం తనదైన తనతనంతో తనరారుతూ కనిపిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు అంకనామాంకితమైన సీతాస్వయంవరఘట్టాన్నే తీసుకుందాం -

శ్రీరామచంద్రమూర్తియొక్క మంజులముగ్ధమనోహరరూపాన్ని దర్శిస్తూ పరవశిస్తూనే సీతమ్మ-

‘మాహేశ్వరం ధనుఃకుర్యాదధిజజ్యం చేద్దదామి తామ్’ - అన్న తండ్రి ప్రతిజ్ఞనువిని, మనస్సులో - “ఎవరైతే శివధనుస్సును ఎక్కుపెడతారో వానికి సీతనిస్తాను”

శ్లో ॥ కమఠపృష్ఠకఠోరమిదం ధనుః - మధురమూ ర్తిరసౌరఘునందనః| కథమధిజ్యమనేన వియతామ్ - అహహ తాత పణస్తవ దారుణః ||

ఈ ధనుస్సు (బాణం) తాబేటి వెనక భాగంలా చాలా గట్టిగా, కఠినంగా ఉంది. కానీ రఘునందనుడైన శ్రీరాముడు రూపంలో ఎంతో మృదువుగా, మధురంగా ఉన్నాడు. ఇంత మృదువైన రూపాన్ని కలిగిన శ్రీరాముడు ఈ ధనుస్సును ఎలా ఎత్తి, ఎలాగైనా దీన్ని వంపుతాడో ఆశ్చర్యంగా ఉంది. అయ్యో ! నాన్న (జనక !) ఎందుకింత కఠిన పరీక్షను పెట్టావయ్యా ! అనిబాధ పడుతుంది. జనకుడుకూడా సభలో లోకరావణుడైన రావణుని చూచి -

శ్లో ॥మాహేశ్వరో దశగ్రీవః - క్షుద్రాశ్చాన్యే మహీ భుజః | పినాకారోపణం శుల్కం - హా ! సీతే ! కిం భవిష్యతి ||

“ఈ సభలో రావణుడు , క్షుద్రులైన ఇతర రాజులు ఉన్నారు. నేను శివధనుస్సును ఎక్కుపెట్టుటను శుల్కము గా పెట్టాను. అయ్యో ! తల్లీ సీత ! ఏమవుతుందో కదా”

అని వ్యాకులపడతాడు. దాన్ని మరింత యెక్కువచేసేలా రావణపురోహితుడు -

శ్లో॥ సార్ధం హరేణ హరవల్లభయాచ దేవ్యా - హేరంబషణ్ముఖవృషప్రమథావకీర్ణమ్| కైలాసముద్ధృతవతో దశకంధరస్య -కేయంచ తే ధనుషి దుర్మద దోఃపరీక్షా ?

రావణా! నీవు శివునితో, , హరవల్లభ (పార్వతీదేవి), దేవి (పార్వతీ), హేరంబ (గణేశుడు), షణ్ముఖ (కార్తికేయుడు), వృష (నందీశ్వరుడు), ప్రమథగణాలు (శివుని గణబృందం) – వీరందరితో నిండిన కైలాసాన్ని ఎత్తినవాడివి. అలాంటి నీకు ఈ ధనుస్సు (శివధనుస్సు) ముందు చేయబోయే బలపరీక్ష ఏమిటి? అని ఆధిక్షేపిస్తాడు.అందరూ భయభంగా చూస్తూ ఉంటే రావణుడు సాటోపంగా యెంతో ఆర్భాటంతో వచ్చి దానిని యెత్తలేక భంగపడతాడు. వినయంతో విశ్వామిత్రునకు నమస్కరించి రామచంద్రమూర్తి లీలగా ఆ ధనువును చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే -

శ్లో ||గృహీత హరకోదండే రామే పరిణయోన్ముఖే। పస్పన్ద నయనం వామం జానకీ జామదగ్నయోః ॥

పరిణయోన్ముఖుడైన రామయ్య శివధనుస్సు చేబట్టిన వెంటనే సీతమ్మకు పరశురామునకు ఎడమకన్నదిర్నది

ఇదీ రచనా శిల్పమంటే. సాహిత్యదర్పణకారుడీశ్లోకాన్ని సహోక్త్యలంకారానికుదాహరణంగా గ్రహించేడు. ఇక్కడ అలంకారముతో పాటుగా శకునశాస్త్ర విశేషంకూడ అభివ్యక్తమవుతున్నది -

శ్లో॥చక్షుర్వామం మృగదృశోః - జయకారి భృశం త్వరా ! తదేవ పురుషస్యారాత్ - స్ఫురితం భయశంసనమ్ ||

(వివరణ) రామచంద్రమూర్తి ధనువునెక్కు పెట్టేడో లేదో నన్న విషయం తెలిసేలోగానే ఫెళఫెళార్భటి తో ఆధనువు గా విరిగిపోయింది.

శ్లో ॥ తృట్యద్భీమధనుః కఠోరనినదః తత్రాకరో ద్విస్మయమ్ త్రస్యద్వాజిరవేరమార్గగమనం శంభోః శిరః కంపనమ్ దిగ్దంతిస్థలనం కులాద్రిచలనం సప్తార్ణవోన్మేలనమ్ వైదేహీమదనం మదాంధదమనం త్రైలోక్యసమ్మోహనమ్ ॥

శ్రీరాముడు శివధనుస్సును వంపినప్పుడు, ఆ ధనుస్సు భయంకరమైన శబ్దంతో విరిగిపోయింది. ఆ శబ్దం వల్ల రెండు రకాల ఆశ్చర్యం కలిగింది (అంటే, అందరూ ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు). ఇంద్రుని ఏరావతం కూడా భయంతో పరుగెత్తింది. శివుని తల కంపించిపోయింది. దిక్కులలోని ఏనుగులు తికమకపడ్డాయి. పర్వతాలు కదిలిపోయాయి. ఏడు సముద్రాలు ఉప్పొంగాయి. వైదేహి (సీత) మనస్సులో ఆనందం కలిగింది. అహంకారంతో ఉన్నవారి గర్వం నశించింది. మూడు లోకాలవారు అందరూ మోహించిపోయారు (ఆశ్చర్యంతో మౌనమయ్యారు).

దానిని కల్యాణతిలకంగా భాసించేలా వసంతతిలకావృత్తంలో ఇలా ఉత్ప్రేక్షిస్తాడు మహాకవి

శ్లో||తద్బ్రహ్మమాతృవధపాతకి మన్మథారి క్షత్రాంతకారి కరసమాగమ పాపభీ ఐశం ధనుః నిజపురశ్చరణాయ నూనం దే హం ముమోచ రఘునన్దనపాణితీర్ధే ||

అని. తరువాతఘట్టం - పరశురామగర్వభంగం. శ్రీరామచంద్రమూ ర్తి పరశురాముని చేతిలో నుంచి చాపాన్నందుకుంటాడు. ఆసమయంలో దశరథ, రామ, జానకీమనో భావాలకనుగుణంగా కనిపించే శబ్దచిత్రాలను చూడండి -

దశరథుడు - పరశురామునితో –

శ్లో॥డింభోఽయం నవబాహరీదృశమిదం ఘోరం చ వీరవ్రతం। తత్రోధాద్విరమ ప్రసీద భగవన్! జాత్యైవపూజ్యోసి నః ||

ఈ రాముడు చిన్నపిల్లవాడు. చిఱుత యవ్వనములో తెలియక బాహుబలకండూతి తో వీరత్త్వమును ప్రదర్శించుటకై ఈ శివధనుర్భంగమనే ఘోర కృత్యమును చేసాడు . ఓ భగవన్ ! పరశురామ ! నీవు బ్రాహ్మణుడవగుటచే జాత్యా మాకు సదా పూజనీయుడవు. మాపై దయతో శాంతించ వయ్యా

వెంటనే శ్రీరామచంద్రమూర్తి -

శ్లో॥ ద్విశ్శరం నాభిసంధత్తే ద్విస్థాపయతి నాశ్రీతాన్ | ద్విర్ధదాతి నచార్థిభ్యో రామోద్విర్నాభిభాషతే ।।
- అంటాడు. (ఇది వాల్మీకాన్ననుసరించి అన్నమాట).
రాముడు తన శత్రువుపై రెండుసార్లు బాణాన్ని ఎక్కించడు (ఒకే శత్రువును రెండుసార్లు బాణంతో గాయపర్చడు). తన ఆశ్రితులను రెండుసార్లు రక్షించడు (ఒకరిని ఒకసారి రక్షిస్తే, మళ్ళీ ఆ అవసరం రాకుండా చేస్తాడు). ఆర్థులకు (దయచేయమని అడిగేవారికి) రెండుసార్లు ఇవ్వడు (ఒకసారి అడిగితే, పూర్తిగా ఇచ్చేస్తాడు, మళ్ళీ అడగాల్సిన అవసరం ఉండదు). రాముడు ఒక విషయాన్ని రెండుసార్లు మాట్లాడడు (తన మాట ఒకటే, అది నిజం).
అన్నిటినీ మించి సీతామనోగతాన్నిలా వివరిస్తాడు హనుమన్నాటకకర్త చాలా చమత్కారంగా -
శ్లో ॥ తచ్చాపమాకర్షతి తాటకారౌ - ఆకర్ణమాకర్ణవిశాలనేత్రా ! సాసూయమైచ్ఛిష్ట విదేహజాసౌ - కన్యాం కిమన్యాం పరిణేష్యతీతి ||

పరశురాముని ధనస్సునెక్కుపెడుతున్నప్పుడు తాటక అనే స్త్రీ వధ చేసిన రామయ్యను కళ్లుపెద్దవి చేసుకొని విశాలక్షి అయిన సీతమ్మ చాల అసూయతో ( మొదటి ధనువుతో నన్ను చేబట్టాడు , ఇప్పుడు ఇంకొక ధనువునెక్కుపెట్టి తనకు సవతిపోరు తెస్తాడేమో నని ) చూచినది

ఇవి ప్రథమాంకంలోని రెండు ఘట్టాలు