ఐతిహ్యము

ఉపలభ్యములైన “హనుమన్నాటకం’’, “మహానాటక” మని రెండు ప్రతులలోను రచయిత హనుమంతుడేనని చెప్పబడింది. దామోదరమిశ్ర పండితుడు సంపాదకత్వంలో పరిష్కరింపబడి ప్రకటింపబడిన ప్రతిలోని చివరిశ్లోకం -

రచితమనిలపుత్రేణాథ వాల్మీకినాబ్ధౌ నిహితమమృతబుధ్యా ప్రాఙ్మహానాటకం యత్ సుమతినృపతిభోజేనోద్ధృతం తత్క్రమేణ గ్రథితమవతు విశ్వం మిశ్రదామోదరేణ | హ. నా . 11.96

ఇలా ఒక ఐతిహ్యాన్ని తెలియజేస్తున్నది. హనుమ, రామకథను తొలుత బండరాళ్ళపైన వ్రాసేడు. అది ప్రచారంలోకొస్తే తనరామకథ మరుగునపడిపో తుందని, బ్రహ్మగారియొక్క -

యావత్ స్థాస్యన్తి గిరయస్సరితశ్చ మహీతలే । తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి ।।1.2.36।।

అనే మాటవమ్మయిపోతుంది కావున దానిని గుప్తంగా ఉంచమన్న వాల్మీకిమహర్షి యొక్క అభ్యర్థనను మన్నించి హనుమ ఆ రాళ్లను సముద్రంలో పడవేశాడట! వానిలో లభించిన కొన్ని శ్లోకాలనాధారంగా భోజరాజు మహానాటకమని రామకథను రచింపజేసినాడనిన్నీ, దానిని సంక్షేపించి దామోదరమిశ్రుడిలా హనుమన్నాటకంగా రూపొందించినాడన్నీ - తెలియజేస్తున్నది.

ఆంతరసాక్ష్యాలనుబట్టి చూస్తే ఇది 11-14 శతాబ్దులమధ్య రచింపబడినదిగా కనిపిస్తుంది. దీనిని హనుమంతుడు రచించాడని చెప్పడంకన్నా హనుమన్నామాంకితుడైన ఒక కవితల్లజుడు వ్రాసేడని చెప్పుకోవచ్చు. నవవ్యాకరణవేత్తగా వేదశాస్త్ర పారగుడుగా వాల్మీకిచే బహుధా ప్రశంసింపబడిన ప్రశంసలకు భిన్నంగా కనిపించడమే కాకుండా – అవాల్మీకీయములైన విషయాలెన్నెన్నో యిందులో చోటుచేసు కొన్నాయి. వాలిశ్రీరాముల సంభాషణ, రావణమందోదరీ సంవాదము, అంగదరాయబారము, హనుమత్సీతాసమాగమము - యివన్నీ వాల్మీకంకన్నా భిన్నంగా వర్ణింపబడినాయి. అయినా యీ గ్రంథం యెంతో జనాదరణమునందినది. కారణం దాని కావ్యసౌందర్యమే! దాన్ని కొద్దిగా దర్శించే ప్రయత్నం చేద్దాం