అవతారిక
శ్రీ శివాశివదంపతీ చిత్కళలకు శంకరాచార్య శృంగేరి శారదలకు విబుధ గురు దేవ పాదారవిందములకు అంజలించెద సభలోని అందరికును
సీ|| విజయనగరపౌర విద్వాంసులార! ధీమంతులార! సుగుణవంతులార! సరసహృదయులార! సమ్మాన్యులార!స- న్మిత్రులార! యజాతశత్రులార! పరమ పావనులార! పారగులైనట్టి - పండితోత్తములార! పరములార! దరహాసపూర్వకా దరణంబుతోడ - వక్తలనలరించు వర్యులార!
గీ|| విజయభావన సాహిత్య వేదిపైన నాదు వాక్కుల హనుమన్నాటకమును శాంతచిత్తముతో మీరు సాంతముగను - వినగ కోరుచునుంటినో విబుధులార||
అవతారిక
హనుమన్నాటకం ఒక చిత్రమైన నాటకం. ఇందులో 14 అంకాలు 579 శ్లోకాలు ఉన్నాయి. దీనికే మరో ప్రతికూడా ఉన్నది. దానికి ‘మహానాటక’ మనిపేరు. విషయమిదే. దానిలో 9 అంకాలు 791 శ్లోకాలూ ఉన్నాయి. రెండింటిలోనూ సుమారు 300 శ్లోకాలు సమానంగా కనిపిస్తాయి.
అనర్ఘరాఘవం, ప్రసన్నరాఘవం, శాకుంతలం, మహావీరచరితం,వాల్మీకిరామాయణం,బాలరామాయణం, భోజప్రబంధం, ధ్వన్యాలోకం -లలోని శ్లోకాలుకూడా ప్రాసంగికంగా అక్కడక్కడ కనిపిస్తాయి.
కథ రామకథ. గద్యభాగంకన్నా పద్యాలే యెక్కువగా కనిపిస్తాయి. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క అంకంగా పేరుపెట్టబడింది. జానకీస్వయంవరతో ప్రారంభమై చివరకు శ్రీరామవిజయంతో నాటకం ముగుస్తుంది
- జానకీస్వయంవరము
- రామజానకీవిలాసము
- మారీచాగమనము
- సీతాపహరణము
- శ్రీరామ-వియోగ-విలాపము
- హనుమతః లంకాయాత్ర
- రామసేతుబంధనము
- రావణ-అఙ్గద సంవాదము
- మండోదరీ హితబోధ
- రావణప్రపంచము
- కుంభకర్ణవధ
- మేఘనాథవధ
- లక్ష్మణమూర్ఛ
- శ్రీరామవిజయము
సాధారణంగా సంస్కృతనాటకాలలో స్త్రీలు,భృత్యులు ప్రాకృతంలో మాట్లాడడంకనిపిస్తుంది. కాని హనుమన్నాటకంలో మాత్రం అందరూ సంస్కృ తంలోనే మాట్లాడుతారు. ఇదో విశేషం. సంభాషణలు, అంకవిభజనల వల్ల ఇదొక నాటకంగా కనిపిస్తున్నా తత్త్వమాలోచిస్తే నా దృష్టికిదొక చక్కని పద్యప్రబంధంగా క నిపిస్తున్నది. అయినా ఇందులో నాటక లక్షణాలు కూడా లేకపోలేదు. ‘నాటకే ప్రఖ్యా తమితివృత్తం….‘-అని కదా నాటక లక్షణం. ఇతివృత్తం ప్రఖ్యాతమనిన్నీ నాయకుడు ధీరోదాత్తుడనిన్నీ ప్రత్యేకంగా నిరూపించనవసరంలేదు.